ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలి
- పెండింగ్ నోటీసుల డెలివరీ, హియరింగ్లు, దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
- రోజువారీ లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్ జిల్లా :జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (SIR) ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న నోటీసుల డెలివరీ, హియరింగ్లు, దరఖాస్తులు, ఫారాల డిస్పోజల్లో ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్దేశిత గడువులోగా ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు రోజువారీ కార్యాచరణ ప్రణాళికతో పనిచేయాలని స్పష్టం చేశారు.శనివారం తహసీల్దార్లు, సహాయ ఓటరు నమోదు అధికారులు (AERO), సంబంధిత అధికారులతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా SIR ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల పరిధిలో మండలాల వారీగా పెండింగ్లో ఉన్న నోటీసుల డెలివరీ, హియరింగ్లు, దరఖాస్తుల పరిష్కారం, ఫారాల డిస్పోజల్ తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ అర్బన్ మండలంలో ఏఈఆర్వో పరిధిలో సుమారు 26 వేల నోటీసులు డెలివరీకి పెండింగ్లో ఉండగా, ఇప్పటివరకు సుమారు 600 హియరింగ్లు మాత్రమే పూర్తికావడంపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పెండింగ్ నోటీసుల డెలివరీతో పాటు హియరింగ్లు, దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. బోథ్ మండలంతో పాటు నియోజకవర్గంలోని ఇతర మండలాల్లోనూ పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.SIR ప్రక్రియకు నవంబర్ 5వ తేదీ తుది గడువు ఉన్నందున, అందుబాటులో ఉన్న పనిదినాలను దృష్టిలో ఉంచుకుని ప్రతిరోజూ నిర్దేశిత లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలని కలెక్టర్ ఆదేశించారు. పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు ప్రతి రోజూ కనీసం 900 నోటీసులు, దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేసేలా మండలాల వారీగా కార్యాచరణ రూపొందించుకోవాలని తహసీల్దార్లను ఆదేశించారు. రోజువారీ పురోగతిని ఆన్లైన్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. బీఎల్వోలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి పెండింగ్లో ఉన్న నోటీసులను సంబంధిత ఓటర్లకు వంద శాతం అందజేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. నోటీసుల డెలివరీ అనంతరం హియరింగ్లను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి, సంబంధిత ఫారాలను వెంటనే డిస్పోజ్ చేయాలని సూచించారు.ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ఫస్ట్ డాక్యుమెంట్, సపోర్టింగ్ డాక్యుమెంట్లతో పాటు 1987కు ముందు, 2002కు ముందు, 2004 తర్వాత కాలానికి సంబంధించిన పత్రాలను నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. అవసరమైన పత్రాలను నిబంధనల మేరకు రిటర్నింగ్ అధికారికి పంపాలని, పత్రాల పరిశీలనలో ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించిన ఫారం-6, తొలగింపులు, అభ్యంతరాలకు సంబంధించిన ఫారం-7, సవరణలకు సంబంధించిన ఫారం-8 దరఖాస్తులు క్షేత్రస్థాయి నుంచి సంబంధిత కార్యాలయాలకు సకాలంలో చేరేలా బీఎల్వోలు, ఏఈఆర్వోలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అందిన దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా నిబంధనల ప్రకారం వెంటనే పరిశీలించి పరిష్కరించాలని స్పష్టం చేశారు.ఓటర్ల జాబితా రూపకల్పన అత్యంత కీలకమైన ప్రక్రియ అని కలెక్టర్ పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా, అనర్హులైన పేర్లను నిబంధనల ప్రకారం తొలగించేలా పారదర్శకంగా చర్యలు చేపట్టాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా, నిర్దేశిత లక్ష్యాలను ప్రతిరోజూ సాధిస్తూ SIR ప్రక్రియను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.ఈ జూమ్ సమావేశంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆర్డీవో జగదీశ్వర్ రావు, రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లు, ఏఈఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


