కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయాలి
కేంద్ర ప్రభుత్వ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) అడిషనల్ డైరెక్టర్ జనరల్ శ్రీమతి శృతి పాటిల్ పేర్కొన్నారు. గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలపై గురువారం కవాడిగూడలోని సీజీవో టవర్స్లో పీఐబీ 'వార్త' వర్క్షాప్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఇంటర్ మీడియా పబ్లిసిటీ కోఆర్డినేషన్ కమిటీ(ఐఎంపీసీసీ)లో భాగంగా ఉన్న వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు(పీఎస్యూ)లకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. తమ శాఖల పరిధిలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను, గత 12 సంవత్సరాల్లో సాధించిన ముఖ్య విజయాలను వివరించారు.
ప్రజలకు మరింత సమర్థవంతంగా చేరువయ్యేందుకు భవిష్యత్తులో చేపట్టాల్సిన ప్రచార కార్యక్రమాలు, మీడియా ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన చర్యలపై వారు విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా పీఐబీ విధులు, కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేపడుతున్న కార్యక్రమాల గురించి అడిషనల్ డైరెక్టర్ జనరల్ శ్రీమతి శృతి పాటిల్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ప్రచార కార్యక్రమాలపై సహకారం అందించేందుకు పీఐబీ ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, పథకాలను ఎక్కువ మంది ప్రజలకు చేరువ చేసి, వారు లబ్ధి పొందేలా చూడటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు చెప్పారు.
ఈ కార్యక్రమంలో వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉన్నతాధికారులు, పీఐబీ, సీబీసీ అధికారులు పాల్గొన్నారు.
About The Author


