తల్లిపాలే శిశువుకు తొలి టీకా
తల్లిపాల ప్రాముఖ్యతపై విస్తృత అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్ డా. సత్య శారద
వరంగల్ : ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఈరోజు వరంగల్ సి.కె.ఎం. ఆసుపత్రిలో నిర్వహించిన తల్లిపాల అవగాహన కార్యక్రమానికి వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలింతలు, గర్భిణీలు, వారి కుటుంబ సభ్యులు మరియు ప్రజలకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, శిశువు జన్మించిన మొదటి గంటలోపే వచ్చే ముర్రుపాలను తప్పనిసరిగా శిశువుకు పట్టించాలని సూచించారు. ముర్రుపాలు శిశువుకు సహజ రోగనిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు అవసరమైన పోషకాలను అందిస్తాయని తెలిపారు.తల్లిపాలు తాగిన పిల్లలకు డయేరియా, న్యుమోనియా, కామెర్లు (జాండిస్) వంటి వ్యాధులు వచ్చే అవకాశం తగ్గుతుందని, మెదడు ఎదుగుదల మెరుగుపడుతుందని, తల్లి-బిడ్డల మధ్య అనుబంధం బలపడుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా తల్లులకు ప్రసవానంతర రక్తస్రావం తగ్గడం, గర్భాశయం త్వరగా సాధారణ స్థితికి చేరుకోవడం, స్థూలకాయం తగ్గడం, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ మరియు టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వివరించారు. శిశువుకు మొదటి ఆరు నెలల పాటు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, ఆ తరువాత తల్లిపాలతో పాటు వయస్సుకు తగిన పరిపూరక ఆహారాన్ని అందించాలని సూచించారు. బాలింతలు తగినంత నీరు తాగుతూ, సమతుల్య పోషకాహారం తీసుకోవడం ద్వారా తల్లిపాల ఉత్పత్తి మెరుగుపడుతుందని తెలిపారు. అవసరానికి మించి తల్లిపాలు ఉత్పత్తి అయ్యే తల్లులు మిల్క్ బ్యాంక్కు పాలను దానం చేయాలని, ఆ పాలను అవసరమైన శిశువులకు అందించడం ద్వారా వారి ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొన్నారు. అలాగే తక్కువ బరువుతో పుట్టిన శిశువులకు కంగారూ మదర్ కేర్ విధానాన్ని పాటించడం ద్వారా వెచ్చదనం, రక్షణ మరియు మెరుగైన ఎదుగుదల లభిస్తుందని వివరించారు. గర్భధారణ సమయంలోనే సాధారణ ప్రసవానికి మానసికంగా, శారీరకంగా సిద్ధం కావాలని, సాధారణ ప్రసవం ప్రతి తల్లికి జీవితంలో ఒక అద్భుతమైన అనుభూతి అని, అవసరం లేనప్పుడు శస్త్రచికిత్స ప్రసవాలను ప్రోత్సహించకూడదని సూచించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థులుపాల్గొన్నారు.
Views: 5
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
06 Aug 2026 17:36:34
నిజామాబాద్ :నిజామాబాద్ తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ జన్మదినాన్ని పురస్క రించుకొని, నగరంలో కంటేశ్వర్ చౌరస్తా లో గల కాంస్య విగ్రహానికి, టీఎన్జీవోస్ పక్షాన పూలమాలవేసి నివాళులు...
