రిటైర్డ్ ఒకేషనల్ టీచర్స్కు వెంటనే EHS కార్డులు ఇవ్వాలి
- సీపీఎస్ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యను కూడా పరిష్కరించాలి
- రిటైర్డ్ ఒకేషనల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎడబోయిన శ్రీనివాసరెడ్డి
అక్కన్నపేట, : తెలంగాణ రాష్ట్రంలో రిటైర్డ్ ఒకేషనల్ టీచర్స్తో పాటు సీపీఎస్ పరిధిలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు కూడా నూతన EHS హెల్త్ కార్డులను వెంటనే అందించాలని రిటైర్డ్ ఒకేషనల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎడబోయిన శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు.రాష్ట్రంలోని సర్వీస్ పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లకు నూతన EHS హెల్త్ కార్డుల జారీపై డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ అధికారి పార్వతి, EHS-EHCT కన్వీనర్ హన్మంత్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల DTO, STO అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు.
2.62 లక్షల మంది పెన్షనర్లు.. 67 వేల మందికే కార్డులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ట్రెజరీల పరిధిలో సుమారు 2,62,000 మంది సర్వీస్ పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు ఉన్నారని, వీరిలో ఇప్పటివరకు కేవలం 27 శాతం మందికి మాత్రమే నూతన EHS హెల్త్ కార్డులు అందాయని పేర్కొన్నారు. సుమారు 67 వేల మంది మాత్రమే హెల్త్ కార్డులు పొందారని తెలిపారు. 61 సంవత్సరాలు దాటిన పెన్షనర్లకు వైద్య అవసరాలు అధికంగా ఉండే నేపథ్యంలో హెల్త్ కార్డుల జారీలో మరింత వేగం పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
బేసిక్ పేపై 1.5 శాతం కాంట్రిబ్యూషన్ చెల్లిస్తున్నా కార్డుల కోసం నిరీక్షణ
ప్రస్తుతం పెన్షనర్లు బేసిక్ పేపై 1.5 శాతం హెల్త్ కాంట్రిబ్యూషన్ చెల్లిస్తున్నప్పటికీ, చాలామందికి నూతన EHS కార్డులు అందకపోవడం ఆందోళనకరమని ఎడబోయిన శ్రీనివాసరెడ్డి అన్నారు. EHS కార్డుల కోసం అవసరమైన వివరాలను వెంటనే అప్లోడ్ చేసి, అర్హులైన ప్రతి పెన్షనర్కు కార్డు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
రిటైర్డ్ ఒకేషనల్ టీచర్స్కు ప్రత్యేక శ్రద్ధ అవసరం
సీపీఎస్ పరిధిలో పదవీ విరమణ పొందిన రిటైర్డ్ ఒకేషనల్ టీచర్స్కు కూడా EHS కార్డుల విషయంలో ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని ఎడబోయిన శ్రీనివాసరెడ్డి కోరారు. పదవీ విరమణ అనంతరం వైద్య భద్రత అత్యంత అవసరమైన సమయంలో సాంకేతిక, పరిపాలనా కారణాలతో హెల్త్ కార్డులు ఆలస్యం కాకూడదన్నారు. రిటైర్డ్ ఒకేషనల్ టీచర్స్ అందరికీ నూతన EHS కార్డులు వెంటనే అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
పెన్షనర్లు వెంటనే హెల్త్ కార్డులు పొందాలి
సర్వీస్ పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు అందరూ తమ వివరాలను సంబంధిత ట్రెజరీ కార్యాలయాల్లో నమోదు చేయించుకొని నూతన EHS హెల్త్ కార్డులు పొందాలని అధికారులు సూచించినట్లు తెలిపారు. హెల్త్ కార్డుల జారీపై అన్ని జిల్లాల DTOలు, STOలు సత్వర చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ అధికారి ఆదేశించినట్లు పేర్కొన్నారు.పెన్షనర్ల సమస్యలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పేరి వెంకట్రెడ్డి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. డిపెండెంట్లకు సంబంధించిన అంశంపై పూర్తి స్పష్టత తీసుకొచ్చి అర్హులైన అందరికీ EHS కార్డులు అందేలా కృషి చేస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


