బిజినపల్లి లో పురాతన పద్ధతిలో వినాయక నిమజ్జనం వేడుకలు
ఎద్దుల బండిపై ఊరేగింపు, శ్రీకృష్ణ యూత్ సభ్యులను అభినందించిన గ్రామ ప్రజలు
నాగర్ కర్నూల్ : బిజినపల్లి గ్రామంలోని సంతోష్ నగర్ కాలనీలో శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయకుని నిమజ్జన వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యూత్ సభ్యులు వినాయక విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన ఎద్దుల బండిపై ఉంచి, డోలు చప్పుళ్లతో, భజనలతో ఊరేగింపుగా తీసుకెళ్లి ఘనంగా నిమజ్జనం వేడుకలు నిర్వహించారు. భక్తులు బొడ్డెమ్మలు , కోలాటాలతో సందడి చేశారు. విజన్ ఆంధ్ర రిపోర్టర్ శ్రీకృష్ణ యూత్ కమిటీ సభ్యులు పలకరించగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాలుగా పురాతన పద్ధతిలోనే నిమజ్జన వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ వేడుకలకు గ్రామ ప్రజల నుంచి మంచి స్పందన రావడం ఎంతో సంతోషం కలిగించిందని అన్నారు. ప్రస్తుత వాతావరణంలో డీజే శబ్దాల వల్ల ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎద్దుల బండి, డోలు వాయిద్యాలు, అడుగుల భజనలతో శాంతియుతంగా వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు. మరుగునపడుతున్న మన పురాతన పద్ధతులను ప్రస్తుత సమాజానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, గ్రామ ప్రజల నుంచి మంచి స్పందన రావడం ఎంతో సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


