మహిళల సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి బాధితులకు సత్వర న్యాయం చేయాలి
- భార్యాభర్తల వివాదాల పరిష్కారంలో సున్నితంగా వ్యవహరించాలి
- వార్షిక తనిఖీలలో భాగంగా ఉమెన్ పోలీస్ స్టేషన్ పరిశీలన
- జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్ జిల్లా : మహిళల సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని ఉమెన్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ వార్షిక తనిఖీలలో భాగంగా పరిశీలించారు. మొదటగా జిల్లా ఎస్పీకి పోలీస్ స్టేషన్ సిబ్బంది గౌరవ వందనాన్ని అందించి, అదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి మరియు ఉమెన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బి ప్రణయ్ కుమార్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని రికార్డులు, పెండింగ్ కేసులు, ఫిర్యాదుల పరిష్కార విధానం, పోలీస్ స్టేషన్ నిర్వహణ, పరిశుభ్రతను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి మహిళా ఫిర్యాదుదారితో గౌరవంగా, మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని, వారి సమస్యలను పూర్తిగా తెలుసుకుని వెంటనే స్పందించి అవసరమైన చట్టపరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య తలెత్తే కుటుంబ వివాదాల విషయంలో అత్యంత సున్నితంగా వ్యవహ రిస్తూ బాధితులకు న్యాయం జరిగేలా కౌన్సెలింగ్, చట్టపరమైన చర్యలను సమన్వయంతో చేపట్టాలని తెలిపారు. మహిళల రక్షణ, భద్రతకు ఉమెన్ పోలీస్ స్టేషన్ కీలకమని పేర్కొంటూ, ప్రతి ఫిర్యాదును ప్రాధాన్యతగా తీసుకుని బాధితుల్లో విశ్వాసం కల్పించే విధంగా పనిచేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్ రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఎలాంటి పెండెన్సీ లేకుండా చూడాలని, కేసుల దర్యాప్తును నాణ్యత ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేసి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, ఉమెన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బి ప్రణయ్ కుమార్, ఏఎస్ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


