బాలికల భద్రతపై ప్రత్యేక దృష్టి.
- మహిళల రక్షణకు షీ టీమ్స్.. బాలికలకు భరోసా
- అత్యవసర పరిస్థితుల్లో 112కు కాల్ చేయాలి
- షీ టీమ్ ఎస్ఐ రమాదేవి
కొత్తగూడెం బ్యూరో : మహిళలు, బాలికలు ఎలాంటి వేధింపులకు గురైనా భయపడకుండా పోలీసులను ఆశ్రయించాలని షీ టీమ్ ఎస్ఐ రమాదేవి సూచించారు. మహిళలు, బాలికల భద్రతకు షీ టీమ్స్ ప్రత్యేకంగా పనిచేస్తున్నాయని తెలిపారు. శుక్రవారం రామవరం ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్ లో మహిళా భద్రత, షీ టీమ్స్పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్ఐ రమాదేవి మాట్లాడుతూ రాగింగ్, టీజింగ్, వెంటపడటం, బ్లాక్మెయిలింగ్, తప్పుడు ఫోన్ కాల్స్, అసభ్యకరమైన మెసేజ్లు, బహిరంగ ప్రదేశాల్లో అసభ్యంగా ప్రవర్తించడం, అనుచితంగా తాకడం లేదా తోయడం వంటి ఘటనలను నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్లు, బస్సులు, మార్కెట్లు, రద్దీ ప్రాంతాలు తదితర ప్రదేశాల్లో మహిళలు, బాలికలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఫిర్యాదు చేయడానికి భయపడొద్దు
పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు కొందరు మహిళలు, బాలికలు ఇబ్బంది పడుతుంటారని, అలాంటి వారి కోసం షీ టీమ్స్ అందుబాటులో ఉంటాయని రమాదేవి తెలిపారు. బాధితులు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో పాటు వాట్సాప్ మెసేజ్, వాయిస్ రికార్డింగ్ లేదా రాతపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. అవసరాన్ని బట్టి షీ టీమ్స్ బాధితుల వద్దకు చేరుకుని సమస్య పరిష్కారానికి సహకరిస్తాయని తెలిపారు. ఫిర్యాదుదారుల వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు.
సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్త
మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిచయం లేని వ్యక్తులకు వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, వీడియోలు పంపకూడదని, అనుమానాస్పద లింకులు, మెసేజ్లకు స్పందించవద్దని తెలిపారు. ఫోన్ ద్వారా బెదిరింపులు, బ్లాక్మెయిలింగ్ లేదా అసభ్యకరమైన మెసేజ్లు వచ్చినప్పుడు వాటిని తొలగించకుండా ఆధారాలను భద్రపరచి పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
భరోసా సేవలపై అవగాహన
భరోసా కోఆర్డినేటర్ సుమలత మాట్లాడుతూ మహిళలు, బాలికలకు అందుబాటులో ఉన్న భరోసా కేంద్రం సేవలపై అవగాహన కల్పించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్తో పాటు పోక్సో చట్టంలోని ముఖ్యమైన అంశాలను వివరించారు. కొన్ని పోక్సో కేసుల ఉదాహరణలను వివరిస్తూ విద్యార్థులకు చట్టపరమైన అవగాహన కల్పించారు. కౌమార దశలో ఏర్పడే ఆకర్షణలు, సోషల్ మీడియా మరియు మొబైల్ ఫోన్ అధిక వినియోగం వల్ల ఎదురయ్యే సమస్యలపై విద్యార్థులకు వివరించారు. విద్య ప్రాముఖ్యతను తెలియజేస్తూ, భవిష్యత్తుపై దృష్టి సారించి లక్ష్యాలను సాధించే దిశగా ముందుకు సాగాలని సూచించారు. మహిళల భద్రతకు ఉపయోగపడే టి–సేఫ్ యాప్ గురించి కూడా అవగాహన కల్పించారు.
భయాన్ని అధిగమించేందుకు ప్రాక్టికల్ విధానాలు
విద్యార్థుల్లో భయాన్ని తగ్గించి మానసిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు ఫిల్లిస్ క్రిస్టల్ థెరపీకి సంబంధించిన బీచ్ బాల్, స్టార్ (భయ నివారణ) విధానాలను ప్రాక్టికల్గా వివరించారు. విద్యార్థులు భయాందోళనలకు లోనుకాకుండా సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనేలా అవగాహన కల్పించారు. మైనర్లు తప్పు చేసిన సందర్భాల్లో వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులను పిలిపించి కౌన్సెలింగ్ అందిస్తామని, నేరం తీవ్రతను బట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని షీ టీమ్ సిబ్బంది తెలిపారు. మహిళలు, బాలల రక్షణకు సంబంధించిన పోక్సో చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం తదితర చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
అత్యవసర సమయంలో 112కు కాల్
ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా వెంటనే 112కు కాల్ చేసి పోలీసుల సహాయం పొందవచ్చని ఎస్ఐ రమాదేవి తెలిపారు. మహిళలు, బాలికలు తమకు ఎదురయ్యే సమస్యలను దాచిపెట్టకుండా పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. మహిళ ల భద్రత, విద్యార్థుల్లో చట్టపరమైన అవగాహన, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని భరోసా బృందం పేర్కొంది. కార్యక్రమంలో భరోసా కోఆర్డినేటర్ సుమలత, ఏఎస్ఐ కస్తూరి, పీసీ రాంబాబు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


