క్షయ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం: జిల్లా కలెక్టర్ రాజర్షిషా
ఆదిలాబాద్ : ప్రజల భాగస్వామ్యంతోనే క్షయ (టీబీ) రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘టీబీ ముక్త్ భారత్ అభియాన్’ జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ‘ప్రతి ఒక్కరిపై దృష్టి.. టీబీ రహిత తెలంగాణకై కృషి’ నినాదంతో కార్యాచరణ అమలు చేస్తున్నట్లు తెలిపారు. వ్యాధి ముందస్తు గుర్తింపు, నివారణ చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు మానసిక, పోషకాహార భరోసా కల్పించడంలో ప్రజాప్రతినిధులు, ప్రజలు ముందుకు రావాలని కోరారు. లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దనీ, కేవలం దగ్గు మాత్రమే కాకుండా తెమడలో రక్తం పడటం, తరచూ జ్వరం, ఛాతీ నొప్పి, నీరసం, బరువు తగ్గడం, రాత్రి వేళల్లో చెమటలు పట్టడం, శరీరంలో వాపులు/గుల్లలు రావడం టీబీ లక్షణాలేనని స్పష్టం చేశారు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదా ఆశా కార్యకర్తలను సంప్రదించి ఉచిత పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వివరాలు, సలహాల కోసం ‘ని-క్షయ్’ టోల్ఫ్రీ నంబరు 1800-11-6666 ను సంప్రదించవచ్చని తెలిపారు.ఈ సమావేశంలో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్వో డా.సాధన, జిల్లా క్షయ నియంత్రణ అధికారి సుమలత, డీఆర్డీవో రవీందర్ రాథోడ్, జడ్పీ సీఈవో రవి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, ఇతర అధికారులు, సిబ్బంది, వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


