తెలంగాణ చౌక్ లో 420 హామీల ఫ్లెక్సీతో గంగుల సంచలనం
ప్రజా క్షేత్రంలోనే కాంగ్రెస్ కు దడ పుట్టించిన మాజీ మంత్రి
కరీంనగర్, : ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ వద్ద బుధవారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో సుమారు 500 మంది కార్యకర్తలతో తెలంగాణ చౌక్ దద్దరిల్లింది.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలతో కూడిన భారీ ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ గంగుల వినూత్న రీతిలో నిరసన తెలిపి సంచలనం సృష్టించారు. వారం రోజుల నిరసన కార్యక్రమాల్లో భాగంగా తొలి రోజే ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్ కు దడ పుట్టించారుఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. అబద్ధపు హామీలతో ప్రజలకు మాయమాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నేడు రాష్ట్రంలో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదని, ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైన ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ తరపున ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. రైతు భీమా పథకానికి తూట్లు పొడిచారని, కల్యాణ లక్ష్మి పథకాన్ని తుంగలో తొక్కారని, ఫీజు రీయింబర్స్ మెంట్ అందక విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని విమర్శించారు. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్, ఆసరా పెన్షన్ల పెంపు జాడ లేదని, యువతులకు స్కూటీల హామీ నీటి మీద రాతలయ్యాయని అన్నారు. అనంతరం ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలను బాకీ కార్డు రూపంలో ముద్రించి బాటసారులకు, వాహనదారులకు, బస్సు ప్రయాణికులకు స్వయంగా బస్సెక్కి మరీ గంగుల అందజేయడం విశేషంగా నిలిచింది. 420 హామీల మోసాన్ని అసెంబ్లీ వేదికగా ఎత్తిచూపుతామని, ప్రతి హామీ నెరవేర్చే వరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, మాజీ గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, మండల అధ్యక్షులు పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, కాసారపు శ్రీనివాస్ గౌడ్, మైనార్టీ నగర అధ్యక్షులు మీర్ సౌకత్ అలీ, కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


