వినాయక మండపాలపై పోలీసుల ఆంక్షలు ఎందుకు?
- హిందువులకు పండుగలు జరుపుకునే స్వేచ్ఛ లేదా?
- బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి
ఎల్లారెడ్డిపేట,: వినాయక చవితి సందర్భంగా వినాయక మండపాల ఏర్పాటుపై పోలీసులు విధిస్తున్న ఆంక్షలు ఏమిటని బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హిందువులు తమ పండుగలను స్వేచ్ఛగా జరుపుకునే పరిస్థితి లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. వినాయక మండపాల నిర్వాహకులను అనుమతులు, నిబంధనల పేరుతో పోలీస్ స్టేషన్లకు పిలిపించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. డీజేలు, లైటింగ్, మండపాల నిర్వహణ తదితర అంశాలపై పోలీసులు యువకులను హెచ్చరిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. వినాయక చవితి సందర్భంగా మండపాల ఏర్పాటు నుంచి నిమజ్జనం వరకు ప్రతిదానికీ పోలీసుల అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. హిందువులకు పండుగలు స్వేచ్ఛగా జరుపుకునే హక్కు లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వినాయక మండపాల నిర్వాహకులు, యువకులకు పోలీసులు ఎలాంటి ఇబ్బందులు కలిగించినా, కేసుల పేరుతో భయభ్రాంతులకు గురిచేసినా బీజేపీ వారి పక్షాన నిలబడి పూర్తిగా అండగా ఉంటుందని పొన్నాల తిరుపతిరెడ్డి స్పష్టం చేశారు. పండుగను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ప్రభుత్వం, పోలీసులు సహకరించాలని ఆయన కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


