ఖబడ్దార్ మర్రి జనార్దన్ రెడ్డి
ఐఎన్టియూసీ తాలూకా అధ్యక్షుడు మహబూబ్ అలీ
నాగర్ కర్నూల్ ,అచ్చంపేట : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనకు రాష్ట్ర ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని ఐఎన్టియూసీ తాలూకా అధ్యక్షుడు మహబూబ్ అలీ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, 2 లక్షల రుణమాఫీ, రైతు బీమా, సన్న వడ్లకు రూ.500 బోనస్, మహాలక్ష్మి గ్రూపులకు వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ ఇండ్లు వంటి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని తెలిపారు. ఇవి చూసి ఓర్వలేక మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అచ్చంపేటలో సభ ఏర్పాటు చేసి అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆయన మాటలను అచ్చంపేట ప్రజలు ఎవరూ నమ్మరని అన్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారని, ప్రజల మధ్య ఉంటూ లక్షల విలువైన ఉచిత ఆపరేషన్లు చేయిస్తున్నారని కొనియాడారు. అచ్చంపేట వంశీకృష్ణ అడ్డా అని, ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీకి ఎవరు అడ్డొచ్చినా సమాధానం చెప్పడానికి ఐఎన్టియూసీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఇకపై తప్పుడు మాటలు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టియూసీ టౌన్ అధ్యక్షుడు సలేశ్వరం, అచ్చంపేట మండల అధ్యక్షుడు మౌలానా, బల్మూర్ మండల అధ్యక్షుడు చందు నాయక్, ఉప్పునుంతల మండల అధ్యక్షుడు రామచంద్రయ్య, తాలూకా కార్యదర్శి శ్రీరామ్ నాయక్, స్వామి గౌడ్, రాజు, వెంకటేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


