రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే కుట్రలను తిప్పికొట్టాలి:ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్ ఘన్పూర్, (జనగామ) :కొన్ని రాజకీయ పార్టీలు వారి స్వార్థం కోసం రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలనే కుట్రల ను ప్రతీ ఒక్క పౌరుడు తిప్పికొట్టాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శనివారం 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా దేశ ప్రజలందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను అర్పించారని, వారి త్యాగాలు, దేశ ప్రజల సంఘటిత పోరాట ఫలితంగానే స్వాతంత్రం సిద్ధించిందని అన్నారు. దేశంలో కుల, మత, ప్రాంత బేధాలు ఉండవద్దని, దేశ ప్రజలందరికీ సమాన హక్కులు అవకాశాలు ఉండాలని తెలిపారు. అసమానతలు లేని సమాజం నిర్మాణం కావాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత పూర్వక రాజ్యాంగాన్ని మనకు అందించారని పేర్కొన్నారు. భవిష్యత్ లో ప్రజల అవసరాలను ముందుగానే గుర్తించి రాజ్యాంగంలో ఆర్టికల్స్ పొందు పర్చారని అలా పొందు పర్చిన ఆర్టికల్ 3ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగామని అన్నారు. పటిష్టమైన రాజ్యాంగం ఉన్నందువల్లనే భారత దేశం సమైక్యంగా సమగ్రంగా భిన్నత్వంలో ఏకత్వంగా పురోగమిస్తుందని తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీలు వారి స్వార్థం కోసం రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని, ఆ కుట్రలను ప్రతీ ఒక్క దేశ పౌరుడు తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. లౌకిక దేశమైన భారత దేశాన్ని మతతత్వ దేశంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దేశ అభివృద్ధిని పక్కన పెట్టి దేవుని పేరుతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కుల, మత, ప్రాంతాలను మర్చిపోయి అందరం కలిసి బ్రతుకుతున్న దేశంలో రాజ్యాంగానికి తూట్లు పొడిచి వ్యవస్థను నాశనం చేయవద్దని పాలకవర్గాలు, రాజకీయ పార్టీలను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


