ఔట్సోర్సింగ్ ఉద్యోగుల బతుకులకు భద్రత ఎక్కడ?
- సమాన పనికి సమాన వేతనం,
- ఉద్యోగ భద్రత కల్పించాలి: రాష్ట్ర జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ రాజమ్మద్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు 5, 10, 20, 22 సంవత్సరాలుగా నిరంతరంగా సేవలందిస్తున్నప్పటికీ, నేటికీ వారికి ఉద్యోగ భద్రత లేకపోవడం దురదృష్టకరమని రాష్ట్ర జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ రాజమ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి ప్రభుత్వ శాఖలకు సేవలందిస్తున్న ఉద్యోగుల బతుకులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో డిగ్రీలు, పీజీలు, పీహెచ్డీలు చేసిన వారు సైతం ఉన్నారని, అర్హతలకు తగిన ఉద్యోగ భద్రత, వేతనాలు మాత్రం లభించడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుత ధరల పెరుగుదలకు అనుగుణంగా జీతాలు లేకపోవడంతో ఉద్యోగులు కుటుంబాలను పోషించుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కొన్ని సంస్థలు, శాఖల్లో మూడు, నాలుగు నెలల పాటు జీతాలు చెల్లించకపోవడంతో ఉద్యోగుల కుటుంబాలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత, నిబంధనల ప్రకారం నియామకాలు, మెరుగైన సేవా భద్రత లభిస్తాయని ఆశించిన ఉద్యోగులకు ఇప్పటికీ నిరాశే మిగిలిందన్నారు. గత ప్రభుత్వాలు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పట్టించుకోలేదని, ప్రస్తుత ప్రజా పాలన ప్రభుత్వం అయినా వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. గ్రామస్థాయి కార్యాలయాల నుంచి రాష్ట్రస్థాయి సచివాలయం వరకు దాదాపు ప్రతి ప్రభుత్వ శాఖలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కీలక సేవలు అందిస్తున్నారని మహమ్మద్ రాజమ్మద్ గుర్తు చేశారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేయడంలో వీరి పాత్ర ఎంతో కీలకమన్నారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం చేయడం సరికాదని అన్నారు.జలమండలి ఉద్యోగుల వరుస మరణాలపై ఆందోళన ఇటీవల హైదరాబాద్ జలమండలిలో ఔట్సోర్సింగ్ మీటర్ రీడింగ్ ఉద్యోగులు వరుసగా మృతి చెందడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు సుమారు నలుగురు ఉద్యోగులు మృతి చెందినప్పటికీ, అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులకు తగిన భద్రత, రక్షణ కల్పించడంలో ప్రభుత్వం, అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పని ఒత్తిడి, ఉద్యోగ భద్రత లేకపోవడం, తక్కువ వేతనాలు వంటి సమస్యలు ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అన్నారు. ఉద్యోగుల ప్రాణాలకు భరోసా కల్పించడంతో పాటు పని ప్రదేశాల్లో భద్రతా ప్రమాణాలను కఠినంగా అమలు చేయాలని కోరారు. సీఎం చొరవ తీసుకోవాలి . ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించి సమగ్ర విధానాన్ని రూపొందించాలని మహమ్మద్ రాజమ్మద్ డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడం, సమాన పనికి సమాన వేతనం అమలు చేయడం, సకాలంలో జీతాలు చెల్లించడం, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల మందికి పైగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులు వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో పనిచేస్తున్నారని, వారి సేవలను ప్రభుత్వం గుర్తించి తగిన గౌరవం, భద్రత కల్పించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.ఏళ్ల తరబడి ప్రభుత్వ వ్యవస్థలో భాగంగా పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఇకపై తాత్కాలిక ఉద్యోగులుగా కాకుండా వారి సేవలను గుర్తించి ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం, సకాలంలో జీతాలు, సామాజిక భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మహమ్మద్ రాజమ్మద్ కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

