నీట్ అవకతవకలపై కాంగ్రెస్ నిరసన
దౌల్తాబాద్ (సిద్ధిపేట): దౌల్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నీట్ పరీక్ష అవకతవకలు, విద్యార్థుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, నీట్ వ్యవహారంలో బాధ్యతవహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద యువతపై పోలీసుల దమనకాండను వ్యతిరేకిస్తూ ప్రధాని నివాసం వద్ద నిరసన చేపట్టిన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ ప్రియాంక గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆరోపించిన నాయకులు, విద్యా వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావాలని, విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జనగామ మల్లారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మద్దెల స్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి గణేష్ పంచమి, సీనియర్ నాయకులు కర్నాల శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ఆది వేణుగోపాల్, రైతన్న, శ్రీనివాస్గౌడ్, తలారియేసు, ఆంజనేయులుగౌడ్, జిర్కపల్లి శ్రీనివాస్, ఇమ్రాన్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


