ప్రకృతి మార్పులకు అనుగుణంగా పంటల ఎంపిక అవసరం
దౌల్తాబాద్ (సిద్దిపేట): వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని, ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల వ్యవసాయాధికారి సాయి కిరణ్ పేర్కొన్నారు. దౌల్తాబాద్, శేరిపల్లి బందారం గ్రామాల్లో నిర్వహించిన గ్రామ సభల్లో ఎల్నినో వాతావరణ పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య పాల్గొని మాట్లాడారు. రైతులు సంప్రదాయ పంటలతో పాటు తక్కువ నీటితో సాగుచేయగల పంటలను ఎంచుకోవాలని సూచించారు. ప్రకృతి పరిస్థితులను ముందుగానే అంచనా వేసుకుని సాగు ప్రణాళికలు రూపొందించుకుంటే నష్టాలను తగ్గించుకోవచ్చన్నారు. వాతావరణ పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తూ రైతులకు అవసరమైన సూచనలు అందించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని జొన్న, సజ్జ, పెసర, మినుము, కంది వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. పంటల బీమా, నేల పరీక్షలు, నాణ్యమైన విత్తనాల వినియోగంపై అవగాహన పెంపొందించుకోవాలని కోరారు. ఈ గ్రామసభల్లో సర్పంచులు ముచ్చమర్రి అనురాధ రమేష్, పెరుమాండ్ల నర్సింలు,ఏపీఓ రాజు,పంచాయతీ కార్యదర్శి అజయ్ కుమార్, ఉప సర్పంచులు ఆది బాలకృష్ణ, పెరుమాండ్ల రాములు తదితరులున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


