వెంకటకృష్ణపూరం గ్రామంలో వైభవంగా శ్రీ పాండురంగ స్వామి జాతర మహోత్సవాలు
చౌటకూరు,: సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలం పరిధిలోని వెంకటకృష్ణపూరం గ్రామంలో గత మూడు రోజులుగా జరుగుతున్న శ్రీ పాండురంగ స్వామి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. జాతర సందర్భంగా ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.జాతరలో భాగంగా మంగళవారం శ్రీ పాండురంగ స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం బుధవారం తెల్లవారుజామున రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించగా, గ్రామ వీధుల గుండా స్వామివారి ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భక్తులు గోవింద నామస్మరణలతో, భజనలుచేస్తూ రథోత్సవంలో పాల్గొన్నారు. గురు పౌర్ణిమ సందర్భంగా భక్తులు తమ గురువులను దర్శించుకుని ఆశీర్వాదాలు పొందడంతో పాటు శ్రీ పాండురంగ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏడాది నిర్వహించే ఈ జాతర మహోత్సవాలు భక్తిశ్రద్ధల నడుమ అత్యంత వైభవంగా జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. చౌటకూరు మండలంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు జాతరకు తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. జాతర సందర్భంగా ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడగా, గ్రామమంతా భక్తిరసంలో మునిగిపోయింది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


