విద్యార్థుల అభ్యాస లోపాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
• మండల విద్యాధికారి గజ్జెల కనకరాజు
దౌల్తాబాద్ (సిద్దిపేట్) : విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని ముఖ్యంగా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించి వారిని విద్యలో ముందుకు తీసుకురావాలని మండల విద్యాధికారి గజ్జెల కనకరాజు అన్నారు. మండల కేంద్రంలో నిర్వహించిన ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలోనూ ఉన్న ప్రతిభను గుర్తించి వారికి అవసరమైన ప్రోత్సాహం అందించడం ఉపాధ్యాయుల బాధ్యత అని పేర్కొన్నారు. విద్యార్థుల అభ్యాస స్థాయిని ఎప్పటికప్పుడు అంచనా వేసి, వెనుకబడిన వారికి ప్రత్యేక బోధన అందించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. నూతన విద్యా విధానానికి అనుగుణంగా బోధనా పద్ధతుల్లో మార్పులు తీసుకురావా ల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. తరగతి గదిలో సృజనాత్మక బోధన, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, విద్యార్థులతో స్నేహపూర్వక వాతావరణం కల్పించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. ముఖ్యంగా పాఠశాలల్లో హాజరు శాతాన్ని పెంచడం, డ్రాపౌట్లను నివారించడం, ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థుల అభ్యాస లోపాలను గుర్తించి పరిష్కరించడంపై దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు సూచించారు. శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు తమ అనుభవాలను పంచుకోగా, కార్యక్రమంలో బోధనలో వినూత్న పద్ధతులు, విద్యార్థుల అభ్యాస నైపుణ్యాల పెంపు, పాఠశాల నిర్వహణ తదితర అంశాలపై శిక్షణ అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


