పర్వతాన్ని జయించిన పోలీస్ పరుగుల వీరుడు
రాజన్న సిరిసిల్ల: లడక్లో సముద్ర మట్టానికి 17,618 అడుగుల ఎత్తులో నిర్వహించిన ఖర్దుంగ్ లా ఛాలెంజ్లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ అనిల్ అద్భుత ప్రతిభ కనబరిచారు. 72 కి.మీ. అల్ట్రా మారథాన్ను 13 గంటల 23 నిమిషాల 54 సెకన్లలో పూర్తి చేశారు. అంతేకాకుండా మరుసటి రోజే 42.2 కి.మీ. లడక్ మారథాన్ను కూడా విజయవంతంగా పూర్తి చేశారు.
కఠినమైన కొండ మార్గాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులను అధిగమించి ఈ ఘనత సాధించిన అనిల్ను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అభినందించారు. విధి నిర్వహణతో పాటు ప్రతిష్టాత్మక క్రీడా పోటీల్లో పాల్గొని విజయాలు సాధించడం ద్వారా పోలీస్ శాఖలోని యువ సిబ్బందికి అనిల్ స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. భవిష్యత్తులో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. “ఖర్దుంగ్ లా పర్వత మార్గం నా శారీరక, మానసిక సామర్థ్యాలకు కఠిన పరీక్షగా నిలిచింది. ప్రతి అడుగు పరిమితులను పరీక్షించినా ఆత్మస్థైర్యాన్ని మాత్రం ఓడించలేకపోయింది. లక్ష్యాన్ని చేరుకోవాలనే సంకల్పంతో ముందుకు సాగి 72 కి.మీ. పరుగును పూర్తి చేశాను” అని అనిల్ తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


