అధికారుల నిర్లక్ష్యంతోనే ఇద్దరు విద్యార్థుల మృతి : బి ఎస్ పి ఆగ్రహం
మల్యాల, : జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలోని బీసీ హాస్టల్లో చదువుతున్న ఇద్దరు గిరిజన/వెనుకబడిన తరగతుల విద్యార్థులు అధికారుల, పాఠశాల యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యం వల్లే అకాల మరణం చెందారని బహుజన్ సమాజ్ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు బొల్లంపల్లి సంపత్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్యాల బీసీ హాస్టల్లో 4వ తరగతి చదువుతున్న సుశాంత్, 5వ తరగతి చదువుతున్న విష్ణు అనే ఇద్దరు విద్యార్థులు ప్రైమరీ స్కూల్ నుంచి బాత్రూమ్ కోసమని బయటకు వచ్చారని, పక్కనే ఉన్న భీమన్న గుట్ట వద్ద అక్రమంగా మోరం తవ్వడం వల్ల ఏర్పడిన లోతైన గుంతలో పడి చనిపోయారని పాఠశాల యాజమాన్యం తెలియజేసిందన్నారు. సమాచారం అందుకున్న బిఎస్పీ నాయకుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుని, ఆ గుంతను మరియు పక్కనే ఉన్న ప్రమాదకర బావిని స్వయంగా పరిశీలించింది. పాఠశాల పరిసరాల్లో కనీస మౌలిక వసతులు, ప్రహరీ గోడ లేకపోవడం వల్లే ఈ విషాదం జరిగిందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదకరంగా మారిన ఆ గుంతను, పక్కనే ఉన్న బావిని తక్షణమే పూడ్చివేయాలి. పాఠశాల చుట్టూ వెంటనే ప్రహరీ గోడ నిర్మించి, గేటు ఏర్పాటు చేసి మరో ప్రాణం పోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. చనిపోయిన ప్రతి విద్యార్థి కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం వెంటనే చెల్లించాలి. బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలి. అక్రమంగా మోరం తవ్వకాలు జరిపిన వారిపై మరియు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ కార్యక్రమంలో బి ఎస్ పి జగిత్యాల జిల్లా అధ్యక్షుడు బొల్లంపల్లి సంపత్ కుమార్తో పాటు బోనగిరి లక్ష్మణ్, జిల్లా కోశాధికారి రవీందర్, చొప్పదండి నియోజకవర్గం సీనియర్ నాయకులు, ముత్యంపేట మునుగురి అజయ్, మల్లేశం, కోరుట్ల నియోజకవర్గం బి ఎస్ పి అధ్యక్షుడు వి. మహాతేజ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


