మున్సిపాలిటీలో పెరిగిన వీధి కుక్కలు, కోతులు, పందుల బెడద

తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలని ప్రజల విజ్ఞప్తి

మున్సిపాలిటీలో పెరిగిన వీధి కుక్కలు, కోతులు, పందుల బెడద

గజ్వేల్/సిద్దిపేట:  సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో వీధి కుక్కలు, కోతులు, మరియు పందుల సంచారం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోందని, దీంతో పట్టణ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలు, ప్రధాన రహదారులు, మార్కెట్ ప్రాంతంలో గుంపులు గుంపులుగా తిరుగుతున్న వీధి కుక్కలు, కోతుల కారణంగా చిన్న పిల్లలు, వృద్ధులు, ద్విచక్ర వాహనదారులు ఎప్పుడు ఏ ప్రమాదానికి గురవుతారో తెలియని పరిస్థితి నెలకొంది. అలాగే, పట్టణంలోని పలు వార్డుల్లో పందుల సంచారం పెరిగిపోవడంతో పారిశుధ్యం క్షీణించి మురుగునీరు వ్యాపిస్తోంది. స్థానిక ప్రజలు, వ్యాపారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగి ప్రజల ప్రాణాలకు ఇబ్బంది కలగకముందే మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వీధి కుక్కలకు కుక్కల సంతాన నియంత్రణ శస్త్రచికిత్స, రాబిస్ నిరోధక టీకాలు వేయించాలని, కోతులు, పందులను జనావాసాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైనందున పట్టణంలో దోమల బెడద విపరీతంగా పెరిగే అవకాశం ఉందని, ఫలితంగా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి విష జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మున్సిపల్ యంత్రాంగం ముందస్తుగా మేల్కొని ప్రతి వార్డులో డ్రెయిన్లలో మురుగు నీరు నిలవకుండా చూడాలని, క్రమం తప్పకుండా ఫాగింగ్ చేయించాలని, యాంటీ లార్వా పిచికారీ ముమ్మరం చేయాలని కోరుతున్నారు. పట్టణ ప్రజల ఆరోగ్యం, ప్రాణ రక్షణను దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ కమిషనర్, సంబంధిత పారిశుధ్య అధికారులు తక్షణమే క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
 
 
Views: 37

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News