శ్రీశైలం వెళ్తున్న బస్సు, ఢీకొన్న టిప్పర్
- ఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్,
- ప్రయాణికుల భద్రతపై అధికారులను అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్
నాగర్ కర్నూల్ :సెప్టెంబర్ 19 శనివారం : నాగర్కర్నూల్ పట్టణంలోని బస్సు డిపో సమీపంలో శనివారం తాండూర్ నుంచి శ్రీశైలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది. అదే సమయంలో అటుగా వెళ్తున్న జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ ఘటనను గమనించి వెంటనే అక్కడికి చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల పరిస్థితిపై కలెక్టర్ ఆరా తీశారు. ప్రయాణికులకు ఏమైనా ప్రమాదం సంభవించిందా, ఎవరికైనా గాయాలయ్యాయా అనే వివరాలను అక్కడున్న అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికుల భద్రతకు సంబంధించి తీసుకున్న చర్యలను కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు. బస్సు, టిప్పర్ డ్రైవర్లకు స్వల్ప గాయాలైనట్లు ట్రాఫిక్ ఎస్ఐ, సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్కు వివరించారు. గాయపడిన వారికి అవసరమైన వైద్య సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రమాదం కారణంగా రహదారిపై ఏర్పడిన పరిస్థితులను కలెక్టర్ పరిశీలించి, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై వివరాలను తెలుసుకున్నారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, ప్రమాదాలు చోటుచేసుకోకుండా రహదారి భద్రతా నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించించారు. 
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


