లక్ష్యాన్ని నిర్దేశించుకుని శ్రమిస్తే విజయం తథ్యం: కలెక్టర్ రాజర్షిషా
ఆదిలాబాద్ : నిశ్చత లక్ష్యంతో శ్రమిస్తే విజయం సాధించడం తథమని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. శనివారం స్థానిక బీసీ, ఎస్సీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో 200 మంది అభ్యర్థులకు ఏర్పాటు చేసిన ఉచిత పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల కోచింగ్ కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి వెలిగించి, సరస్వతి చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టడీ సర్కిల్లో శిక్షణ పొంది ఉద్యోగాలు సాధించిన కానిస్టేబుల్ లను కలెక్టర్ సన్మానించి అభినందించారు. వారు ఈ సందర్భంగా వారి కొంచింగ్ అనుభవాలను పంచుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, కేవలం 20 నుంచి 25 రోజుల్లోనే అధికారుల బృందం సమన్వయంతో మెరిట్ ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేయడం అభినందనీయమని ప్రశంసించారు. ఈ శిక్షణ కోసం మొత్తం 465 మంది దరఖాస్తు చేసుకోగా, ప్రతిభ ఆధారంగా 200 మందిని ఎంపిక చేసినట్లు వెల్లడించారు. విద్యార్థులు మనసులోని భయాన్ని పూర్తిగా విడనాడి, లక్ష్య సాధనపైనే పూర్తిగా దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. అర్హత, ప్రతిభ ఉన్నందుకే ఈ శిక్షణకు ఎంపికయ్యారని, స్టడీ సర్కిల్లో అవసరమైన డిజిటల్ బోర్డులు, నాణ్యమైన స్టడీ మెటీరియల్, అవసరమైన ఫర్నిచర్ వంటి అన్ని వసతులను ప్రభుత్వం సమకూరుస్తోందని తెలిపారు. రెండు నెలల పాటు (60 రోజులు) సాగే తరగతులకు క్రమం తప్పకుండా హాజరవుతూ నోట్స్ తయారు చేసుకోవాలని, సందేహాలు వస్తే సంకోచించకుండా ఫ్యాకల్టీని అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. రోజూవారీ, వారంతపు, గ్రాండ్ టెస్టులను క్రమం తప్పకుండా రాస్తూ, మార్కులు తక్కువ వచ్చిన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని దిశానిర్దేశం చేశారు. తాను సైతం గతంలో ఐఐటీ కాన్పూర్లో చదువుకునే రోజుల్లో సీనియర్ అధికారుల మార్గదర్శనం తీసుకున్నట్లు కలెక్టర్ గుర్తుచేశారు. ప్రస్తుతం శిక్షణ పొందుతున్న అభ్యర్థులు రేపు యూనిఫామ్ధరించి విజేతలుగా నిలిచి, భావి తరాలకు స్ఫూర్తిగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సునీత కుమారి, ఎస్సీ, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్లు రమేష్, ప్రవీణ్ కుమార్, ఫ్యాకల్టీ రమణ, మోటివేటర్ సల్ల విజయ బాబు, స్టడీ సర్కిల్ సిబ్బంది, అభ్యర్థులు, తదితరులు పాల్గొన్నారు.

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


