పర్యావరణ పరిరక్షణకు వినూత్న ముందడుగు
మర్రిగూడ,: సమాజంలో ప్లాస్టిక్ మహమ్మారిని తరిమికొట్టి, పర్యావరణాన్ని కాపాడుకోవాలనే సంకల్పంతో మర్రిగూడ మండలంలో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్లాస్టిక్ రహిత సమాజ స్థాపనే ధ్యేయంగా రాజపేట తండా సర్పంచ్ కొడాల వెంకట్ రెడ్డి గారు ఒక వినూత్న ప్రచారానికి తెరతీశారు.మండలంలోని ఉపాధ్యాయులందరికీ ఆయన స్వయంగా స్టీల్ ప్లేట్లను పంపిణీ చేశారు. సమాజానికి మార్గదర్శకులుగా ఉండే ఉపాధ్యాయుల ద్వారానే మార్పు మొదలుకావాలని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులతో పాటు,వారి తల్లిదండ్రులు కూడా ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా పక్కనబెట్టి, స్టీల్ ప్లేట్లు,స్టీల్ బాటిళ్లనే వాడేలా ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని కోరారు. చిన్నారుల భవిష్యత్తు కోసం ప్లాస్టిక్ రహిత విద్యాసంస్థలను తయారు చేయాలన్నారు.కేవలం పాఠశాలలకే పరిమితం కాకుండా,గ్రామంలో జరిగే శుభకార్యాల్లో కూడా ప్లాస్టిక్,థర్మాకోల్ ప్లేట్ల వాడకాన్ని అరికట్టేందుకు స్థానిక ఫంక్షన్ హాల్కు 2,000 స్టీల్ ప్లేట్లను సర్పంచ్ వెంకట్ రెడ్డి ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు. సర్పంచ్ తీసుకున్న ఈ పర్యావరణ హిత నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శారద, స్థానిక ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


